Popular Posts

Tuesday, June 5, 2012

సురక్షిత నీటి కరువు

సురక్షిత నీటి కరువు

  • ధనిక దేశాల్లో పేదల స్థితి
  • ఐరాస నిపుణురాలి వెల్లడి
ప్రపంచంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలు వాస్తవానికి తమ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు, శానిటేషన్‌ సదుపాయాలు కల్పించాలి. అయితే మైనారిటీ ప్రజలకు, నిరుపేదలకు వాటిని అందించడంలో అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్‌, స్లోవేనియాలు ఎంతగానో వెనుకబడి ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణురాలు శనివారం వెల్లడించారు. 'కాలిఫోర్నియాలోని శాక్రిమోంటోలో ఏదైతే చూశానో దానికి నేను ఎంతగానో విభ్రాంతి చెందాను. అక్కడ పబ్లిక్‌ రెస్ట్‌రూములను మూసివేయడం లేదా తెరిచి ఉండే సమయాన్ని పరిమితం చేయాలని ఆ నగరం నిర్ణయించింది. దాంతో నిలువ నీడలేని అభాగ్యులు తమ శానిటేషన్‌ హక్కును ఉపయోగించుకునేందుకు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి వస్తోంది' అని సురక్షిత మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించిన మానవహక్కులపై ఐరాస ప్రత్యేక దూత కేటరినీ డీ అల్బూక్వెర్క్‌ ఈ సంవత్సరం ప్రారంభంలో తన అమెరికా పర్యటనపై విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. 'బహిరంగ మూత్ర విసర్జన, మల విసర్జనను నేరంగా పరిగణిస్తున్నారు. దీంతో జరిగేదేంటంటే ఎవరైనా తమ భౌతిక అవసరాలు తీర్చుకునేందుకు స్థలం లేకపోవడాన్ని నేరంగా పరిగణించవచ్చు' అని పేర్కొన్నారు. ఇదే రకమైన వివక్ష జపాన్‌లో కొరియా మైనారిటీపైనా, స్లోవేనియాలో రోమా మైనారిటీపైనా సాగుతున్నట్లు ఆమె ఎత్తి చూపారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజలందరూ దాదాపుగా సార్వజనీనంగా సురక్షిత నీటిని అనుభవిస్తున్నారని, అయితే మౌలిక వసతుల రంగానికి ఏటా 400 నుంచి 600 డాలర్ల మేరకు నిధుల కొరత ఉంటున్నందున 21వ శతాబ్దంలో ఆ దేశం ఈ వ్యవస్థను ఇదే విధంగా కొనసాగించగలుగుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని అన్నారు.

ఈ విధానాలు పేద వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాతావరణ మార్పు, కొరత ఉన్న వనరులకు డిమాండ్‌ పెరగడంతో రానున్న సంవత్సరాల్లో అమెరికాలో ఈ వివక్ష సమస్య మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించి తీవ్రతరం కావచ్చని ఆమె తెలిపారు. ఈ సమస్యపై అంతర్జాతీయ ఒప్పందాలను ఆమోదించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వివక్షా లేకుండా సురక్షితమైన నీరు, శానిటేషన్‌ హక్కును అందరికీ గ్యారంటీ ఇచ్చే సమగ్ర ఫెడరల్‌ చట్టాన్ని ఆమోదించాల్సిందిగా ఆమె కోరారు. ఇళ్ళులేని ప్రజలకు సురక్షిత నీరు, శానిటేషన్‌ను అన్ని మున్సిపాలిటీలూ అందించేలా హామీనివ్వాలని పేర్కొన్నారు. జపాన్‌కు సంబంధించి తెలుపుతూ అత్యధిక జనాభాకు సురక్షిత నీరు, శానిటేషన్‌ అందుబాటులో ఉండేలా చూస్తున్నందుకు అల్బూక్వెర్క్‌ ప్రశంసించారు. అయితే మైనారిటీ గ్రూపులు లేదా ఇతరత్రా పేద ప్రజల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరమున్నట్లు ఆమె తెలిపారు. ఇళ్ళు లేనివారు, మైనారిటీలు, వికలాంగులైన వ్యక్తుల పట్ల వివక్షను తొలగించేందుకు ఒక సమగ్ర చట్టాన్ని ఆమోదించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆమె క్యోటోలోని ఓ 90 ఏళ్ళ మహిళ ఉదంతాన్ని ఇక్కడ పేర్కొన్నారు. 'ఆమెకు మురుగునీటి వ్యవస్థ లేదు. ఆమె ఇంటికి గొట్టాల ద్వారా నీరు వచ్చే వసతి లేనందున బావి నుంచే నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ఇలా ఎందుకు జరిగింది' అని ఆమె ప్రశ్నించారు. ఆమె కొరియా మైనారిటీ గ్రూపుకు చెంది ఉండటమే అందుకు కారణమని చెప్పారు. వారు నివసిస్తున్న స్థలానికి సంబంధించి న్యాయపరమైన వివాదం ఉండటం కూడా ఈ వివక్షకు కారణమని పేర్కొన్నారు. చుట్టూ ఉన్న మిగతా తెగలన్నింటికీ జపాన్‌లో సాధారణంగా అందుబాటులో ఉన్న విధంగా మంచినీరు, మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. న్యాయపరమైన వివాదం ఉన్నందున ఈ చిన్న గ్రూపుకు వాటి అందుబాటు లేదని ఆమె చెప్పారు.

స్లోవేనియాలో కూడా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో జనాభాకు మంచినీరు, శానిటేషన్‌కు సంబంధించిన మానవహక్కుల బాధ్యతను నిర్వహిస్తోందని తెలిపారు. అయితే అన్ని రోమా తెగల వారికి మాత్రం ఈ హక్కులు అందకపోవడం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తన కుమార్తె బడికి వెళ్ళనని మొరాయిస్తోందని ఒక వ్యక్తి కన్నీటితో ఆమెకు తెలిపారు. మిగతా పిల్లలు ఆమె దగ్గర వాసన వస్తోందని ఏడ్పించడం వల్ల ఆమె మొండికేస్తున్నట్లు చెప్పారు. 'ఆమె వద్ద వాసన వస్తోందని నాకు తెలుసు. కానీ మాకు నీరు అందుబాటులో లేవు' అని ఆ ఆ వ్యక్తి ఆమెకు తెలిపారు. అయితే ఏం చేస్తావని ప్రశ్నించగా, తన కూతుర్ని పట్టుకుని ఏడవడం మినహా తనకు వేరేమార్గం లేదని ఆయన జవాబిచ్చారని ఆమె చెప్పారు. 'మానవ హక్కులకు సంబంధించి ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ సురక్షితమైన నీరు, శానిటేషన్‌ అందుబాటులో, ఆమోదయోగ్యమైన పద్ధతిలో ఉండాలి. ఈ ప్రాథమిక హక్కులు గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకోవాలి' అని ఆమె తన నివేదికను ముగించారు.

No comments:

Post a Comment