Popular Posts

Tuesday, June 5, 2012

పోగుబడుతున్న సంపద- ఊహకందని విలాసాలు

దేశంలో 70% భారతీయులకు  రోజుకు రూ.20  ఆదాయం కూడా లేదు. 20 శాతం మంది భారతీయులు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరుగుతారు. 40 కోట్ల మంది ప్రజలకు కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేదు.46 శాతం మంది పిల్లలు పోషకాహారం లోపంతో బాధ పడుతున్నారు.56 శాతం మంది యిళ్ళకు విద్యుత్ సౌకర్యం లేదు.25 మంది పట్టాన వాసులు మురికి వాడల్లో కనీస అవసరాలకు కూడా నోచుకోలేకున్నారు. రోజుకు  2 ,191  మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి కూలి పనులకు వలసేల్లుతున్నారు.  రోజుకు 2500 మంది పిల్లలు పౌష్టికాహారం లేక చనిపోతున్నారు. ప్రతి గంటకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు..      

    ఓ పెన్ను ఖరీదు రు.1.36 కోట్లు. అక్షరాలా ఒక కోటి ముప్ఫైలక్షలు. అవును నిజంగా ఇది పెన్ను ఖరీదే. నేడు ఇలాంటి పెన్నులు భారత దేశంలో అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇది మన దేశంలో అత్యధిక ఖరీదు కలిగిన పెన్ను. ఇవి కాకుండా అనేక విదేశీ లగ్జరీ బ్రాండుల పెన్నులు విస్తారంగా చెలామణీ లోకి వచ్చాయి. వీటి ధర రు.10 వేలు, 20 వేలు ఉంటుంది. వాటిలో ఉపయోగించే ఇంకు బాటిల్‌ ఖరీదే రు.12,00 ఉంటుందంటే వాటి సంగతి వూహించుకోవచ్చు. పెన్నులే ఏమిటి రు. 40 వేల విలువైన పాదరక్షలు, లక్ష రూపాయల లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగులు. లక్షల ఖరీదు చేసే కళ్లజోళ్లు. వాచీలు. ఐదు, పది కోట్ల అతి విలాసవంతమైన కార్లు. ఇలాంటివే ఎన్నెన్నో. వీటన్నింటికీ ఈ కాలంలో గిరాకీ బాగా పెరిగిపోతున్నది. ఇవి విలాస వినియోగ వస్తువులు. అసలు వినియోగ స్వభావమే లేని అలంకరణ సామగ్రికి ఇంతకు మరెన్నో రెట్లు వెచ్చించి సంపన్నులు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రధాన పాత్ర పెయింటింగ్‌లదే. గత కొన్నేళ్లుగా ఆర్ట్‌ మార్కెట్‌ ప్రపంచ వ్యాపితంగానే వూపనం దుకున్నది. ఒక్కో పెయింటింగ్‌ ఐదారు కోట్ల విలువ చేస్తుంది. ఇది భారత దేశంలో. ప్రపంచ మార్కెట్‌లో అయితే పదుల కోట్ల ఖరీదు చేసే కళా ఖండాలు అమ్ముడవు తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్ట్‌మార్కెట్‌ మందగించినా, కొందరు ప్రముఖ చిత్రకారుల చిత్రాలకు, లాభాల బాటలో పయనించే కార్పొరేట్‌ సంస్థల నుండి గిరాకీ తరగడం లేదు.

అయినా భారత్‌ నేడు విలాస వినియోగంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. 2009-10లో అగ్రరాజ్యమైన అమెరికా రు.2.7 లక్షల కోట్ల విలాస వినియోగంతో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత రెండవ స్థానం చైనాది. ఈ దేశంలో విలాస వినియోగం రు.39,600 కోట్లు. భారత దేశంలో మాత్రం కేవలం రు.6000 కోట్లు. భారత దేశంలో ఇప్పుడు తక్కువగా ఉన్నట్లు అనిపించినా విలాస వినియోగం ఏడాదికి 25 శాతం చొప్పున పెరిగి 2015 నాటికి రు.1.5 లక్షల కోట్లకు చేరుతుందని ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ అనే సంస్థ అంచనా వేస్తున్నది. ఉదాహరణకు ఢిల్లీ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న బ్లూక్లాతింగ్‌ కంపెనీ అతి ఖరీదైన కోర్నెలియాని, కాడిని అండ్‌ వెర్సేస్‌ విదేశీ బ్రాండ్ల వస్త్రాలను విక్రయిస్తుంది. అలాంటి సంస్థ 2010లో రు.100 కోట్లు వెచ్చించి ముంబాయి, బెంగుళూరు, హైదరాబాదు తదితర నగరాలలో దేశవ్యాపితంగా 25 కొత్త స్టోర్లు ప్రారంభించడానికి సిద్ధం అయింది. ఇది భారత్‌లో పెరుగుతున్న విలాస వినియోగానికి ఒక చిహ్నం. అలాగే అనేక కంపెనీలు అతి సంపన్నులు లక్ష్యంగా తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు పథకాలు రచించుకుంటున్నాయి.

ఇలా అతి విలాస వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ ప్రముఖ స్థానం ఆక్రమించడానికి కారణం తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. గత దశాబ్దన్నర కాలంగా దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అనుసరించబడుతున్నాయి. అంతకు ముందు అనుసరించింది కూడ పెట్టుబడిదారీ విధానమే అయినప్పటికీ, సరళీకృత విధానాలు అవధులు లేని రీతిలో ప్రైవేటు సంపదను అధికం చేశాయి. ఓ వైపున సంపద పెరుగుతుంటే అది అతి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అనే ప్రక్రియ ఈ కాలంలో మరింత తీవ్రమైంది. మరో వైపున సంపన్నులకు పేద సాధారణ జనానికి మధ్య అగాథం అంతులేనంతగా పెరిగిపోతున్నది. దీనికి సంబంధించి లెక్కలు ప్రతి సంవత్సరం వెలువడుతూనే ఉన్నాయి. ఏడాదికేడాదికి ఈ క్రమం ప్రగాఢం కావడం తప్ప సడలే ధోరణే కనిపించడం లేదు.

తాజాగా ప్రసిద్ధ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల పత్రిక ఫోర్బ్స్‌ 2010 సంవత్సరానికి భారత బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. వంద కోట్ల డాలర్లు అంతకు మించి ఆస్తులు కలిగిన వారిని ఈ జాబితాలో చేరుస్తారు. ఈ ఏడాది భారత దేశంలో వందకోట్ల డాలర్లు అంటే రు.4800 కోట్ల వ్యక్తిగత సంపద కలిగిన వారు 69 మంది తేలారు. గత ఏడాది ఇలాంటి వారి సంఖ్య 52. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 17 మంది పెరిగారు. మొట్టమొదటి స్థానాన్ని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ దక్కించుకున్నారు. ఆయన వద్ద ఉన్న షేర్ల నికర విలువ 2,700 కోట్ల డాలర్లు. లండన్‌ కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్ష్మి మిట్టల్‌ 26.1 బిలియన్‌ డాలర్లతో రెండవ స్థానంలో నిలిచారు. తృతీయ స్థానంలో 17.6 బిలియన్‌ డాలర్ల సంపదతో విప్రో అధినేత అజీజ్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. అలా వరుసగా శశిరుయా, రవి రుయా, సావిత్రి జిందాల్‌, అనిల్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, కుశాల్‌ పాల్‌ సింగ్‌, సునీల్‌ మిట్టల్‌, కుమార్‌ బిర్లా ఉన్నారు.పేద, ధనిక తారతమ్యం అధికం కావడమే కాదు సంపన్నుల్లో సైతం సంపద కేంద్రీకరణ ఈ కాలంలో మరింత తీవ్రమైంది. ఇది అమెరికా, చైనాలలో కన్నా అధికంగా ఉంది. భారత దేశంలో అతి సంపన్నులైన 100 మంది సంపదలో పై 10మంది వద్ద 50 శాతం కేంద్రీకృతమయింది. ఇదే చైనాలో వంద మంది సంపదలో పై పది మంది వద్ద 38 శాతం ఉంటే, అమెరికాలో 32 శాతం ఉంది. ప్రపంచంలోనే చైనా తర్వాత రెండవ అతి వేగంగా అభివృద్ధి చెందే దేశంగా భారత్‌ పేరుగాంచింది.

అమెరికాలో మొదలై మొత్తం ప్రపంచాన్ని చుట్టబెట్టిన ఆర్ధిక సంక్షోభం ప్రభావానికి అతి స్వల్పంగా గురయిన భారత్‌ అభివృద్ధి వేగాన్ని కొనసాగిస్తున్నది. కాని ఈ అభివృద్ధి మాత్రం అతి కొద్దిమందికే పరిమితమవుతున్నది. సరళీకృత ఆర్ధిక విధానాలు మొదలయిన తొలిరోజుల్లో వాటివల్ల అత్యధికంగా లాభపడేది మధ్యతరగతి వర్గం అని ప్రచారం జరిగింది. కనీసం 20 కోట్ల మంది మధ్యతరగతి ప్రజానీకం స్థితిగతులు బాగా మెరుగవుతాయని భావించారు. వీరు ఒక దేశం జనాభాతో సమానంగా ఉంటారని, ఇలాంటి వారి అభిరుచులకు తగిన విధంగా ఎన్నో వినియోగ వస్తువులు తయారు చేసి విక్రయించుకోవచ్చని అనేక సంస్థలు ప్రణాళికలు కూడా వేసుకున్నాయి. కాని ఇప్పుడు అలాంటి వారి కన్నా అతి సంపన్నుల మార్కెట్‌ మాత్రమే పెరిగే పరిస్థితి ఏర్పడింది.ఇదే సమయంలో నిరుపేదల సంఖ్య ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోతున్నది. భారత దేశంలో కుబేరుల జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్‌ పత్రికే ఈ దేశంలో ఒక వైపున 59 మంది శతకోటీశ్వరులు ఏర్పడగా, 40 శాతం మంది దారిద్య్రంలోనే మగ్గుతున్నారని పేర్కొంది. ఇటీవలనే ఐక్య రాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధన సమీక్షలో భారత దేశానికి సంబంధించి వెల్లడించిన వివరాలు ఈ అంశాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. దేశంలో పేదల శాతం 27 నుండి 37 శాతం వరకు ఉన్నట్లు రకరకాల అధికారిక అధ్యయనాలు తెలుపుతున్నాయి.

మూడేళ్ల లోపు బాలల్లో 53.5 శాతం మంది పౌష్టికాహార లోపానికి గురవుతున్నారు. 2007 తర్వాత దేశంలో కొత్తగా 3.36 కోట్ల మంది దారిద్య్రంలోకి నెట్టివేయబడ్డారు. ఒక్క 2009లోనే 1.36 కోట్లమంది దారిద్య్ర రేఖ దిగువకు చేరుకున్నారు. మరొక అంచనా ప్రకారం 2 డాలర్లకన్నా దినసరి సగటు ఆదాయం లభించే వారు దేశ జనాభాలో 77 శాతం మంది ఉన్నారంటే పరిస్థితిని తేలిగ్గానే వూహించుకోవచ్చు. వాస్తవం ఇది కాబట్టే ఒక వైపున అతి సంపన్నులు విలాసం కోసం వాడే వస్తువులు గిరాకీ పెరిగి పోతున్నది. విదేశీ కంపెనీలు ఇలాంటి మార్కెట్‌ కోసం ఎగబడుతున్నాయి. మరో వైపున పేద, సాధారణ, మధ్యతరగతి వారికి అవసరమయ్యే వినియోగ సరకులు, ఇతర సామగ్రి గిరాకి తగినంతగా పెరగక పోవడంతో వాటి ఉత్పత్తి, ఉపాధి కల్పన కూడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.---గుడిపూడి విజయరావు   Thu, 7 Oct 2010, IST 

No comments:

Post a Comment